ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు. శుక్రవారం కేంద్ర వాణిజ్య,పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఇతర ప్రధాన అంశాలపై ఇరువురు చర్చించారు.
ఫిబ్రవరి 26న హైదరాబాద్లో బయో ఏషియా-2025 సదస్సు జరగనుంది. దీనికి రావాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ను ఆహ్వానించారు మంత్రి శ్రీధర్బాబు. జీవ విజ్ఞాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, పాలసీ మేకర్లు, పారిశ్రామిక నిపుణులను రానున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.దీనికి హాజరవుతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో జీవ విజ్ఞాన రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబు ఇచ్చారు.
తెలంగాణలో మేగా లెదర్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్రం సహాయం కోరారు మంత్రి శ్రీధర్బాబు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ గ్రామం, జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ గ్రామం వద్ద మెగా లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. పార్కుల అభివృద్ధికి అవసరమైన సామూహిక కర్బన వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం సహాయాన్ని కోరారు.
జాతీయ పారిశ్రామిక మార్గ అభివృద్ధి సంస్థ పరిధిలో జహీరాబాద్ నోడ్ అభివృద్ధిపై మంత్రి శ్రీధర్బాబు కేంద్ర మంత్రితో చర్చించారు. ప్రస్తుత పురోగతిని వివరించారు. అనుమతుల మంజూరు, నిధుల విడుదల త్వరితగతిన చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జపాన్లోని ఓసాకా ఎక్స్పో-2025 తెలంగాణ పాల్గొంటున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ వేదికగా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు జపాన్లో ఓసాకా ఎక్స్పో జరగనుంది. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా హాజరవుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు అధికారికంగా తెలియజేశారు శ్రీధర్బాబు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి రాసిన లేఖను ఆయనకు అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.