ఏపీకి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్న సీఎం టీమ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఒప్పందాలు కుదుర్చు కుంటున్నారు. బుధవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటి అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని రిక్వెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్బోర్డ్ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించాలన్నారు.
దక్షిణ భారత్లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలన్నారు. మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని విజ్ఞప్తి చేశారు మంత్రి లోకేష్. సీఎం చంద్రబాబును కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు బిల్ గేట్స్.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా బిల్గేట్స్ చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్ గేట్స్ తో సమావేశంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల కిందట సరిగ్గా 1995లో హైదరాబాద్కు ఐటీ ఫలాలు రావడానికి ఎలాంటి కృషి చేశారో.. ఇప్పుడు ఏపీకి ఏఐకి విషయంలో అలాంటి సహకరాలు చేస్తారని భావిస్తున్నట్లు ఎక్స్లో ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.
ఇరువురు మధ్య సమావేశం దాదాపు రెండు గంటలపాటు జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు ఏపీని గ్లోబల్ హబ్గా మార్చేందుకు సహకారం అందించాలని వివరించారు.