ఎన్ కన్వెన్షన్ తోపాటు హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. మరోవైపు, మాజీ మంత్రి కేటీఆర్పైనా విమర్శలు గుప్పించారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదని రఘునందన్రావు విమర్శించారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టలేదని, చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్కు తెలియదా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వారి బాధ్యతలు మర్చిపోయి మాట్లాడుతున్నారని రఘునందన్రావు విమర్శించారు. పార్టీలనే తేడా లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలనీ 2010 లోనే హై కోర్టు తీర్పు ఇచ్చిందని బీజేపీ ఎంపీ గుర్తుచేశారు.
కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసినట్టు ఒక డ్రామా నడిపిస్తున్నారని, రేవంత్ రెడ్డికి, హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన రెండు వేల ఐదు వందల చెరువులు కాపాడాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అంతేగాక, ఇవాళ మీరాళం ట్యాంక్ ఉందా? అని రఘునందన్రావు ప్రశ్నించారు. అక్కడి ఎంఐఎం వాళ్లకి, కార్పొరేటర్లకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గిందన్నారు. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేశారని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
2014లోనే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టలని హై కోర్టు తీర్పు ఇచ్చిందని, 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో నుంచి ముక్కు పిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ మంత్రిగా పని చేశారని, ఆయన తీసుకున్న చర్యలు ఎంటని రఘునందన్రావు నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు లేవా?, హరీశ్, కవిత, కేటీఆర్కు 111 జీవో పరిధిలో ఆస్తులు లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ఎందుకు కాపాడుతున్నారని, ముందు ముగ్గురు ఇళ్లు కులగొట్టాలని రఘనందన్ రావు డిమాండ్ చేశారు. జన్వాడ ఫామ్హౌస్ కూలగొట్టడానికి రేవంత్కు భయమెందుకని నిలదీశారు.