అక్కన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన చోటు చేసుకున్న హత్య కేసు నిందితుడు గుగులోతు బీమాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అక్కన్నపేట మండలం మసిరెడ్డి తండ గ్రామానికి చెందిన గుగులోతు రాజు, మరియు గుగులోతు బీమా అన్నదమ్ములకు గత కొద్ది రోజుల నుండి భూమి ఆస్తి తగాదా విషయంలో జరుగుతున్న గొడవలు మనసులో పెట్టుకొని ఈనెల 12 వ తేదీ నాడు గుగులోతు బీమా, అతను కొడుకు గుగులోతు అనిల్, హైదరాబాద్ నుండి బైక్ పై మసిరెడ్డి తండాకు వచ్చి, గుగులోతు లలిత తో కలిసి తన అన్న గుగులోతు రాజును, కర్రలతో, ఇనుప పైపులతో కొట్టి ముగ్గురు కలిసి ఒక పథకం ప్రకారం హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో వారిపై హత్య కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ కేసు పరిశోధనలో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయమున హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్, సిబ్బందితో కలిసి జనగామ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితున్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నందున అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన వాహనాన్ని జప్తు చేశారు.