నిజామాబాద్ లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. మున్సిపల్ ఆఫీసులో పని చేసే ఓ అధికారి ఇంట్లో నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు ఉన్నట్లు వారు గుర్తించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతడు ఆదాయానికి మిచి భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
ఇందుకు సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరేందర్ ఇంటితోపాటు కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆ ఆఫీసర్ అసలు రంగు బయటపడింది. ఏసీబీ సోదాల్లో మొత్తం రూ. 2,93,81,000 నగదు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. మొత్తం రూ. 6 కోట్ల 7 లక్షల విలువగల ఆస్తులను ఏసీపీ గుర్తించింది.