తెలంగాణ రాష్ట్రానికి భారీ గుడ్న్యూస్ అందింది. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. వచ్చే మే నెలలో 7వ తేదీ నుంచి 31 తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రారంభ, ముగింపు వేడుకలు ఉంటాయని నిర్వాహణ సంస్థ వెల్లడించింది.
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలె హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ అందాల పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ పోటీలకు సంబంధించిన అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక, సంస్కృతిక, వారసత్వ, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కలిసి ప్రకటించారు.
కాగా, మిస్ వరల్డ్ పోటీలు 2024లో ముంబైలో జరిగాయి. దాదాపు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్ కి చెందిన క్రిస్టినా పీజ్కోవా మిస్ వరల్డ్గా గెలుపొందింది. 1996లో మొదటిసారి ఇండియాలో మిస్ వర్లడ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో గ్రీస్ కి చెందిన ఇరెనా స్క్లీవా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మనదేశంలో మిస్ ఇండియా వరల్డ్ పోటీలు జరగడం గమనార్హం.