గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారును బెదిరించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన వంశీని పోలీసులు రిమాండ్ పై మూడు రోజుల క్రితం విజయవాడ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో వంశీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో వంశీ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ప్రోద్భలంతో దాడి జరిగినట్లు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీతో పాటు మొత్తం 88 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిన తరుణంలో హఠాత్తుగా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది.