రాజకీయ నాయకులకు కాస్త పట్టు విడుపు ఉండాలని కొందరు అప్పుడప్పుడు చెబుతుంటారు. తాను అనుకున్నది జరగాలని పట్టుబడితే ఇబ్బందులు తప్పవు. తనతోపాటు వచ్చినవారు ఇబ్బందులు తప్పవు. చివరకు కేసుల్లో బుక్కవుతారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై కేసు నమోదు అయ్యింది. ఆయనతోపాటు మరో ఎనిమిది కూడా అడ్డంగా బుక్కయ్యారు.
జగన్ సహా ఎనిమిది మందిపై కేసులు
మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. బుధవారం గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించారు జగన్. ఈ పర్యటన నేపథ్యంలో జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వాటిని బేఖాతరు చేశారు ఆ పార్టీ నేతలు.
ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు జగన్. ఎన్నికల కోడ్తో పాటు, పోలీసు యాక్ట్ ప్రకారం విధించిన నిషేధాలను ఉల్లంఘించారు. దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి బుధవారం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు అయ్యింది.
ఎవరిపై కేసులు
జగన్తోపాటు మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం 10 న్నర నుంచి 11 న్నర మధ్య జగన్ తోపాటు పార్టీ నేతలతో కలిసి గుంపుగా యార్డులోకి ప్రవేశించారు. ఇందుకు యార్డు కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోలేదు.
స్థానిక ప్రజలు, మిర్చిలోడుతో వచ్చిన రైతులకు అసౌకర్యం కలిగించారు. దీంతో మిర్చియార్డు ఎదుట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు రావడంవల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అనుచరులతో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం విరుద్ధం.
అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసే పనిలో పడ్డారు పోలీసులు. మిర్చి యార్డును సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు జగన్. మరోవైపు తాను గుంటూరుకు వస్తున్నాని తెలిసి కనీసం పోలీసు భద్రత కూడా ఇవ్వలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్. రేపు తాము అధికారంలోకి వచ్చాక ఇలాగే పోలీసు భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని, మీరు చేస్తుంది కరెక్టో కాదో మీరే ఆలోచించుకోవాలన్నారు.
గవర్నర్కు వైసీపీ ఫిర్యాదు?
ఈ నేపథ్యంలో జగన్కు సరైన భద్రత కల్పించలేదన్న విషయపై గురువారం రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు.అధినేతకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేయబోతున్నారు. గవర్నర్ను కలవనున్న టీమ్ లో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి ఉండనున్నారు.