కార్పొరేట్ పాఠశాలలకు పరుగులు.. ఆపై ఫీజుల భారాలు.. ఆత్మహత్యాయత్నాలు.. ఆత్మహత్యలు.. ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న తీరు. బాలల బంగారు భవిష్యత్ కు బంగారు బాటలు వేయాలన్న కోరికతో తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. ఆ ఆలోచనలో పుట్టుకొచ్చిందే.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తాజాగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లపై దృష్టి సారించిన సీఎం, అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. సాధ్యమైనంత త్వరగా స్కూల్స్ నిర్మాణం జరగాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందుకు ప్రతీ నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు అన్నీ వసతులతో కూడిన విద్యా మందిరం, సాంకేతికతను అందిపుచ్చుకొనేలా విద్య, ఇలా ఎన్నో అంశాలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. ఈ స్కూల్స్ లలో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలు కూడా అందిస్తాయని చాటి చెప్పడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందుకే కాబోలు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ స్కూల్స్ నిర్మాణంపై దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తే చాలు, అక్కడి విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నది ప్రభుత్వ వాదన.
సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం విద్యాశాఖ అధికారులతో స్కూల్స్ నిర్మాణంపై సమీక్షించారు. ఇప్పటివరకు స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలన్నారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని, రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వందశాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని, ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కూడా సీఎం స్పష్టం చేశారు. సీఎం సమీక్ష తర్వాత యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంలో కదలిక వచ్చే అవకాశం ఉండగా, పేద విద్యార్థులకు ఉత్తమ విద్య మరింత చేరువ కానుందని చెప్పవచ్చు.