విశాఖలో బాలికల జువైనల్ హోమ్ దగ్గర బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జువైనల్ హోమ్ గోడలు దూకి బయటకు వచ్చిన కొందరు బాలికలు రోడ్డుపై ఆందోళనలకు దిగారు. పెద్ద, పెద్దగా కేకలు వేస్తూ గొడవ సృష్టించారు. దీంతో.. ఆ వైపుకు వెళ్లే వాళ్లతో పాటు మీడియా సిబ్బంది బాలికల ఆందోళనలకు కారణాలపై ఆరా తీస్తున్నారు. దీంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వాళ్లు ఎందుకు ఆందోళనలకు దిగారనే విషయమై అనేక చర్చలు జరుతున్నాయి.
బాలికలు జువైనల్ హోమ్ నుంచి బయటకు వచ్చి గోడవకు దిగిన విషయం తెలిసిన పోలీసులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాలికల్ని హోమ్ లోపలికి పంపించారు. ఈ క్రమంలోనే పెద్దగా కేకలు వేసిన బాలికలు.. హోం లోపల తమను సిబ్బంది వేధిస్తున్నారని, తీవ్రంగా కొడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. తమను లోపల రక్షణ లేదని, తమకు కాపాడాలి అంటూ ఏడుస్తూ విన్నవించుకున్నారు. తమకు.. జువైనల్ హోం లోపల మత్తు మందు ఇచ్చి హింసిస్తున్నారంటూ.. సంచలన ఆరోపణలు చేశారు. దాంతో.. ఈ వ్యవహారం క్రమంగా తీవ్రమవుతోంది.
బాలికలు ఆందోళనల విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. జువైనల్ హోం లోపల బాలికలకు ఎలాంటి వసతులు కల్పించారు. వారి ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మత్తు మందులు ఇచ్చి హింసిస్తున్నారన్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించిన రాష్ట్ర హోం మంత్రి.. బాలికల ఆరోపణలపై విశాఖ జిల్లా పోలీస్ కమిషనర్, కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు.
ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించిన హోం మంత్రి.. మహిళా పోలీసు, తహసీల్దార్ నేతృత్వంలోని అధికారులు బాలికలతో మాట్లాడాలని ఆదేశించారు. తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్న ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని.. బాలికలు చేసిన ఆరోపణల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు.