నాలుగు పథకాల కోసం లబ్దిదారులను ఎంపిక చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 21 నుంచి 24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహించిన లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. సభల్లో తలెత్తిన సమస్యలపై ఫోకస్ చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి.
బుధవారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామాల్లో సభలు, రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ అంశాలపై చర్చ జరిగింది. ఎదురైన సమస్యల గురించి అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సమాచారం అందుకున్నారు.
ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రేషన్ కార్డులు అర్హులైన వారికి అందరికి అందజేస్తామన్నారు. రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుంద న్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే, ప్రజా పాలన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు.
అర్హులందరికీ కార్డు సాచురేషన్ మోడ్లో కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు సదరు మంత్రి. ఈనెల 26 నుంచి రాష్ట్రంలో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. అందరికీ కార్డులు అందేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రేషన్ కార్డులు ఇప్పుడు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గ్రామాలలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేశారు. ప్రజలకు కార్డులు అందేలా చూడల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనం తీసుకోవాలని వివరించారు. మంచి బియ్యం ఇస్తున్నామని, ఇది గొప్ప అడుగుగా వర్ణించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆలోచనను అందరూ అభినందించాలన్నారు.
పదేళ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వబోతున్నామన్నారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యానికి ఏటా 7 వేలు కోట్ల రూపాయలు వ్యయం చేసేవారని, కానీ వాటిని ఎవరు తినలేదన్నారు. కార్డుల నుంచి వచ్చిన బియ్యాన్ని బయట అమ్ముకునేవారని గుర్తు చేశారు.