E-PAPER

YouTube

  హైడ్రా ఆగదు.. ఆ పెత్తనం సాగదు: సీఎం రేవంత్

తెలంగాణలోని అన్ని వర్గాలనూ అభివృద్ధి బాట పట్టించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే సెప్టెంబరు 17ను ప్రజా పాలనా దినోత్సవంగా జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి, అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. నిరంకుశ పాలన నుంచి బయటపడి, ఈ గడ్డపై ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజుగా సెప్టెంబరు 17ను ముఖ్యమంత్రి అభివర్ణించారు.

 

బహుళత్వమే మన బలం…

సెప్టెంబర్ 17 అనేది ఒక ప్రాంతం, ఒక కులం లేదా ఒక మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, నాడు అన్ని వర్గాల ప్రజలు తమదైన శైలిలో ప్రజాస్వామ్యం కోసం పోరాడారని, దీనిని రాజకీయ కోణంలో చూడటం అవివేకమని సీఎం అన్నారు. అందుకే విలీనం, విమోచనం, విద్రోహం అనే పేర్లను పక్కనబెట్టి ప్రజాపాలనా దినోత్సవంగా దీనిని తమ ప్రభుత్వం జరుపుతోందన్నారు. ప్రజల మధ్య ఐకమత్యం ఉన్నప్పుడే ఏ సమాజమైనా ప్రగతి పంథాలో పయనిస్తుందని, నేటి తెలంగాణకు అది అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ బానిస సంకెళ్లు తెంచుకున్న చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. తెలంగాణలోని పెత్తందారులపై, నియంతలపై ఈ పిడికిలి ఇలాగే ఉండాలన్నారు. ఈ సందర్భంగా ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ.’ అనే దాశరథి కృష్ణమాచార్య రాసిన కవితను చదివి వినిపించారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

హైడ్రా ఆగదు..

నగరంలో పర్యావరణం పునరుజ్జీవం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రానే గ్యారంటీ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అక్రమార్కుల భరతం పట్టి తీరతామని, దీనికి ప్రజల సహకారం కావాలన్నారు. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టామని, వచ్చే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. అలాగే గద్దర్ పేరున సినిమా అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ నేడు డ్రగ్స్ సిటీగా దిగజారడానికి కారణం గత పదేళ్ల పాలనేనని, దానిని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక కుటుంబపు పెత్తనం నుంచి తెలంగాణను విముక్తం చేశామని, ఇంకా వారు పెత్తనం చేయాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోబోమన్నారు.

 

ప్రగతి పథంలో తెలంగాణ

ఎంతో మంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పాలన సాగాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోందని గుర్తుచేశారు. హామీల అమలుకు గ్రామాల్లో, వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి 2.84 లక్షల దరఖాస్తులను స్వీకరించిందని గుర్తుచేశారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే రూ. కోటి 79 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందారని తెలిపారు. అదే విధంగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం, రూ. 2 లక్షల రుణ మాఫీకి గాను లక్షా 9 వేల మంది రైతులకు 905 కోట్ల రూపాయలు అందించినట్టు తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాలనలో గుణాత్మక మార్పును తెస్తున్నట్లు తెలిపారు.

 

ఢిల్లీ దేశంలోనే ఉంది..

తాను ఢిల్లీ వెళ్తే కొందరు విమర్శలు చేస్తున్నారన్న సీఎం రేవంత్.. ఢిల్లీ పరాయి దేశంలో ఏమీ లేదని, అది మన దేశ రాజధాని అని చెప్పారు. తాను ఫౌమ్‌హౌస్ సీఎంను కాదని, పనిచేసే సీఎంను కాబట్టే.. ప్రజల కోసం కృషి చేస్తున్నానని కౌంటరిచ్చారు. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో వాటా తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కును సాధించుకునేందుకు ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతానని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు